ఆ రక్తం... దేశంలో ముగ్గురికే..!
★ ఆ బ్లడ్ గ్రూప్ పేరు "పీ-నల్"
☆ ప్రమాదవశాత్తు గాయాలపాలైన చిన్నారికి చికిత్సకోసం డాక్టర్ వీణా షెనాయ్ ఎంతో కృషి చేసి ఈ గ్రూప్ ఉన్న వ్యక్తి వివరాల సేకరణకు పట్టు వదలకుండా ప్రయత్నం చేసింది.
పీ-నల్ మనదేశంలో కేవలం ముగ్గురికే ఉన్న అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్. ఈ గ్రూప్ కోసం ఈ మధ్య ఓ డాక్టర్ సోషల్మీడియాలో పెద్ద యుద్ధమే చేసి వెతికి పట్టుకుంది. గుజరాత్కి చెందిన ఐదేళ్ల పాప మెట్ల మీద నుంచి కింద పడటంతో తీవ్రగాయాలై రక్తస్రావమైంది. దాదాపు కోమా దశకి చేరుకున్న ఆ చిన్నారిని ఏప్రిల్ చివరి వారంలో ఎర్నాకుళంలోని అమృత హాస్పిటల్లో చేర్పించారు. అప్పుడే ఆ పాపది పీ-నల్ బ్లడ్ గ్రూప్ అని తెలిసింది. కానీ పాపకి ఆపరేషన్ చేసి బతికించాలంటే రక్తం ఎక్కించాల్సిందే. ఎలాగైనా ఆ గ్రూపు ఉన్న వారిని వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకుంది పాపకి చికిత్స అందించే డాక్టర్ వీణా షెనాయ్. దేశవిదేశాల్లోని బ్లడ్ బ్యాంకులను సంప్రదించినా, కార్పొరేట్ ఉద్యోగుల డేటా సేకరించినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరికి ట్విట్టర్లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న శశిథరూర్ సాయం తీసుకుని పీ-నల్ దాత కావాలనే విషయాన్ని పోస్ట్ చేయించింది. క్రమంగా ఆ పోస్ట్ వైరల్ అయి ఆ విషయం దేశంలోని మెడికల్ కాలేజీలూ, డాక్టర్లూ, ఎన్జీవోల వరకూ చేరడంతో అంతా అన్వేషణ మొదలుపెట్టారు. అయితే 2018లో మణిపాల్ కస్తూర్బా కాలేజీలో ఓ రోగికి ఈ గ్రూపు ఉన్నట్టు గుర్తించారు కానీ వివరాలు దొరకలేదు. దాదాపు రెండు నెలల తరవాత- ఈ నెల మొదటి వారంలో ఐసీఎంఆర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోహెమథాలజీకి చెందిన డాక్టర్ స్వాతి కులకర్ణి నాసిక్ పరిసరాల్లో ఓ వ్యక్తికి ఈ బ్లడ్ గ్రూపు ఉన్నట్టు చెప్పారు. వెంటనే వీణా బృందం నాసిక్ అర్బన్ బ్లడ్ బ్యాంకును సంప్రదించి అక్కడకు వంద కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఉన్న దాతను చేరుకోగలిగింది. అతడిని బ్లడ్ బ్యాంకును తీసుకొచ్చి పరీక్షలు చేస్తే పాప గ్రూప్తో మ్యాచ్ అయింది. ఉన్నపళంగా ఓ కొరియర్ సర్వీసుతో ఒప్పందం చేసుకుని కంట్రోల్డ్ టెంపరేచర్ ఉండే కంటెయినర్లో బ్లడ్ను ఉంచి ఎర్నాకుళానికి తెప్పించి పాపకి ఆపరేషన్ చేసింది వీణ. అలా పట్టు వదలకుండా ఆమె చేసిన కృషి వల్ల పాప ఇప్పుడే కోలుకుంటోంది.
చిరంజీవికి త్వరగా స్వస్థత చేకూరాలని మనం కూడా ప్రార్థిద్దాం.
No comments:
Post a Comment